గుంటూరు-నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు మరియు ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో కమిషనర్ మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా అన్ని వార్డుల్లో వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వ్యర్థాలను పూర్తిగా తొలగించాలన్నారు. సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని రోడ్లపై ఎక్కడెక్కడ వ్యర్థాలు ఉన్నాయో గుర్తించి, వెంటనే వాటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ వ్యర్ధాల తరలింపు ప్రక్రియను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని గడువు విధించారు. భవన నిర్మాణాలు చేపట్టే యజమానులు మరియు కాంట్రాక్టర్లు తమ వ్యర్థాలను రహదారుల పక్కన, డ్రైనేజీ కాలువలలో పారబోయడం వల్ల ట్రాఫిక్కు ఆటంకం కలగడమే కాకుండా, పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఇకపై ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై మట్టి, రాళ్లు, ఇటుకలు వంటి శిథిలాలను వేస్తే వారిపై భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిఘా పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలను తరలించడానికి నిర్దేశించిన ప్రాంతాలకు మాత్రమే తరలించాలని, ఒకవేళ సొంతంగా తరలించలేని పక్షంలో నగరపాలక సంస్థ నిర్ణయించిన రుసుము చెల్లించి సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.