భీమవరం: పట్టణంలో స్వచ్ఛత, సుందరీకరణకు పెద్దపీట వేస్తూ, టౌన్ హాల్ రోడ్డుకు ఆనుకుని ఉన్న యనమదుర్రు డ్రైన్ గట్టును అభివృద్ధి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ , ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ సిబ్బందితో కలిసి టౌన్ హాల్ ప్రాంతంలోని యనమదుర్రు డ్రైన్ గట్టు ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గట్టు మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న దుస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం కింద ప్రకాశం చౌక్ వంతెన నుండి గవర్నమెంట్ హాస్పటల్ వంతెన వరకు ఉన్న యనమదుర్రు డ్రైన్ పరిసర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో శుభ్రపరిచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. శుభ్రతతో పాటు ఆ ప్రాంతాన్ని సుందరీకరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయాలని తెలిపారు. డ్రైన్ గట్టు పొడవునా రైలింగ్, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రజల భద్రతను పాటించడంతోపాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలు నాటాలని, చిన్న పార్క్ రూపంలో అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే సాయంత్రం సమయంలో ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఆకర్షణీయమైన లైటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా పట్టణ సుందరీకరణకు తోడ్పడటమే కాకుండా, ప్రజలకు శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ అధికారులు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఈ పరిశీలనలో భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, సహాయ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ తాతారావు, టీపీఓ పార్థసారథి, ఏసీపీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About The Author